మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా…
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరానిపదమందెనటుగాన
అని అన్నమయ్య పాడుకున్నాడంటే, ఆ రోజుల్లో ఆ వెంకటపతి సేవలో తరించే వారి జీవితం ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. కానీ ప్రజాతంత్రపు ప్రతినిధిత్వాన్నే ఆధిపత్యంగా మార్చుకున్న నాయకుల దయాదాక్షిణ్యాల మీద భగవత్సేవకుల జీవితాలు ఆధారపడి ఉన్న ఈరోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉందా?
తరతరాలుగా స్వామివారి సేవలో తరిస్తున్న కుటుంబాలని ఆలయ వ్యవహార విషయాలలో పూచికపుల్లలాగా తీసి పడేసి, ఆగమ విషయాల గురించిన కనీస జ్ఞానంలేని అయ్యేయెస్ ఆఫీసరుని వాళ్ళ నెత్తిమీద కూచోబెట్టీ, వీళ్ళందరి మీద ఆధిపత్యం చెయ్యడానికి కొంత మంది రాజకీయుల్ని తోలి వినోదం చూస్తున్న నాయకులన్న ఈరోజుల్లో వారికి దైన్యం తప్ప ఏం మిగిలింది?
ఒక్క జీవోతో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలనీ హక్కులనీ తోసిపడేయగలమన్న పొగరుతో విర్రవీగుతున్న రాజకీయ నాయకులని చూసి వీరంతా భయంతో వణకరా? ఒకరి ఉద్యోగమో జీవితమో కాదు, వారి వంశపు భవిష్యత్తు మొత్తం వీరి చేతుల్లో లేదూ? అసలు ఇటువంటి పరిస్థితికి కారణం ఏమిటి?
అర్చకులైనా, ప్రభువులైనా ప్రాధమికంగా మనుషులే. పూర్వకాలంలోనైనా ఇప్పుడైనా వారి ప్రాధమిక తత్వం స్వయం లాభమే అయి ఉంటుంది. వీరెవరూ బ్రహ్మజ్ఞానులు కారు సాధారణంగా. ఐతే పూర్వం రాజులకి నిరంకుశాధికారం లేదా? ఇప్పటికన్నా ఎక్కువేనే?
పూర్ణకుంభాల స్వాగతాలు పూర్వకాలంలో పుట్టిన సంప్రదాయమే. రాజుకూ, అధికారులకూ కొంత అధికారం ప్రాధాన్యత అప్పుడూ ఉండేది. కానీ తేడా ఏమంటే, స్వామి వారి సేవలో ఉండే వారికి పరిపూర్ణమైన స్వేచ్చ, నిర్భీతి ఉండేవి.
ఇవి ఎలా సాధ్యమయ్యేవి? ఇటువంటి స్వేచ్చ, నిర్భీతత్వం కలిగి ఉండడానికి వారి నిష్ట, జీవన విధానం ఒక కారణమైతే అప్పటిలో పాటించిన ధర్మశాస్త్రాలు, సాంఘిక కట్టుబాట్లూ మరొక కారణం.
ఆచార వ్యవహారాలనీ, ధర్మశాస్త్ర విషయాలనీ సమన్వయంతో అర్ధం చేసుకోకుండా అనాగరికత ముద్ర వేసి, సినిమాలు తీసి వెక్కిరించి వాటి పైన గౌరవాన్ని సంఘంలో నాశనం చేసి కుదిరినచోటల్లా చట్టాలు తెచ్చి తొక్కిపడేసిన ఈరోజుల్లో సాధ్యమవ్వడం ఎలా?
ఒక ఉదాహరణ గుర్తు వస్తోంది. నవాబు ఇచ్చిన తాంబూల సత్కారం గ్రహించినందుకు ఒక సంగీత విద్వాంసుడి కుటుంబానికి సంఘ బహిష్కరణ విధించిన వారణాసి పండితుల విజ్ఞతని ప్రశ్నించే మనం, స్వలాభం కోసం అప్రాచ్యుల ప్రాపకానికి పోకుండా ఇటువంటి కట్టుబాట్లు ఎక్కువమంది ప్రజలని ఆపి ఉంచాయన్న విషయం గ్రహించలేకపోయాం.
పవిత్రమైన బాధ్యతలున్న మనుషులకి పెట్టిన కట్టుబాట్లూ నియమాలూ ఇందుకు కాదూ? ఎవరైనా నియమం నిష్టాతో బ్రతుకుతుంటే అది ఒక వివక్ష చూపించడం అని నానాయాగీ చేయడం మనకి సరదా. మడికట్టుకోవడం అనే పదాన్ని అపహాస్యం చేయడానికే వాడుతున్నాం కదా?
ఆచార వ్యవహారాలూ సంప్రదాయాలూ వద్దనుకున్నప్పుడు చిత్తశుద్ధి మాత్రం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇవన్నీ ఆలోచించి నెలకొల్పిన వ్యవస్థలని అప్రాచ్యుల పాలనలో సంపాదించిన మిడిమేలపు జ్ఞానపు కొలబద్దలతో కొలిచి చట్టాలను చేసిన మేధావులకి ఏం తెలుసు ?
ఆలయ ధర్మకర్తగా ఉన్నవాడికి కుక్కజన్మ లభిస్తుందని అనడం వినే ఉంటారు. అంతెందుకు అర్చకత్వానికి కూడా సంప్రదాయంలో ఎక్కువ గౌరవ ప్రదమైన స్థానం లేదు. భగవత్సేవ ద్వారా జీవనభృతి సంపాదించుకోవడం ఒకటైతే, దేవాలయ వ్యవస్థలో ఉండే వ్యక్తులు అత్యంత విరాగులూ బ్రహ్మజ్ఞానులూ ఐతే తప్ప ఎంతో కొంత మనుష్య సహజమైన లాలసత్వం వల్ల తప్పులు జరుగుతాయనే భావన మరొకటి.
ఐతే కాలానుగుణంగా ఈ వ్యవస్థని సంస్కరించుకుంటూ తగినన్ని కట్టుబాట్లతో కుదిరినంత ఉత్తమంగా తీర్చిదిద్దుకోకుండా మరింత దిగజార్చి, వ్యవస్థలోని వ్యక్తులు మాత్రం ఉత్తమంగా ఉండాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
విష్ణోర్బలం ప్రవర్ధతాం.
స్వస్తి.
ఏప్రిల్ 9, 2021
మనుజుడై పుట్టి మనుజుని సేవించి…
నవంబర్ 9, 2020
నోట్లరద్దు 2016 గురించి…
నేను ఒక సగటు భారతీయుణ్ణి మాత్రమే. రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి ఆవేశకావేశాలు నాకులేవు. ట్విట్టర్లో కొంతమంది లాగ ఆ రంగాలలోని వారితో పరిచయాలుండడం వాట్లలోని లోగుట్టులు తెలియడం వంటి పరిస్థితి కూడా కాదు.
నోట్ల రద్దు జరిగినప్పుడు చాలా మంది నాకులాంటి వాళ్ళలాగే ఇదేదో మంచికోసమే అనుకున్నాను. మావొక ఇరవైవేలు పోగొట్టుకోవలసి వచ్చినా దేశంకోసం అనుకుని ఊరుకున్నవాడినే.
నెమ్మదిగా అందులో జరిగిన లోటుపాట్లు కొన్ని బయటకొచ్చాక, మళ్ళీ నేను కూడా చాలా మంది నాకులాంటి వాళ్ళలాగే ఇది సఫలం కాలేదు అనే అనుకున్నా. చెప్పకపోవడమే, ఈ మార్చి వరకూ నేను యూపీఐ వాలెట్లు కానీ కనీసం పేటీయెం కానీ వాడలేదు.
ఐతే నాకు తెలీకుండా భారతదేశంలో ఎంత ఆర్ధిక విప్లవం జరిగిందో నాకు ఈ మార్చిలోనే తెలిసొచ్చింది.
“పనికిరాకపోయినా జీతమిస్తాన్నారుగా, ఇదిగోనండి నా ఫోన్ నంబర్ దీనికి వేసెయ్యండి” – పనమ్మాయి
“సార్! నెల రోజులుగా పనేం లేదు కొంత ఏమైనా సహాయం చెయ్యండి. నా ఫోన్ నంబర్కి వేసిపెడతారా?” – ఇస్త్రీ చేసే అబ్బాయి
“మా అబ్బాయి నిన్న అమెరికా నుంచి ఫోన్లో చెప్పాడు – నా పెన్షన్ పడిందో లేదో ఫోన్ పే లో చూసుకోవచ్చుట కదా. అదేదో కాస్త ఈ ఫోన్లో పెడుదు బాబూ” – పక్కింటాయాన
“ఒరేయ్! మాస శివరాత్రి అభిషేకానికి పూజారిగారికి డబ్బులు పంపాలి, ఆయన ఫోన్ నంబర్కి వెయ్యమని ఇప్పటికి రెండుసార్లు చెప్పా. నా ఫోన్లోనే ఆ యాప్ ఏదో ఇన్ స్టాల్ చెయ్యి నేనే చేసుకుంటా” – నాన్నగారు
ఇవన్నీ చూసాకా నాకు అనిపించిది ఏమిటంటే, భారతదేశంలో నగదు చెల్లించడంలో సమూలమైన మార్పులు వచ్చాయని. బండిమీద పుల్లట్లమ్మే ఆవిడ దగ్గరనుంచి, ఇల్లు కదలడానికి భయపడే వృద్ధుల వరకూ అందరూ ఎంతో సులభంగా సాంకేతికతని వాడుకుంటున్నారు. నామటుకు నేనే ఒక అరడజను పెద్దవాళ్ళకి ఫోన్ పే/ జీ పే లాంటివి వాడడం నేర్పించి ఉంటా. వాళ్ళెంతో తెలివిగా వాడుకుంటున్నారు కూడా.
ఇంత విప్లవం జరగడానికి రెండు ముఖ్య కారణాలు. అందరికీ బేంక్ సేవలు అందు బాటులోకి రావడం ఒకటి. నోట్ల రద్దు వల్ల ఈ యాప్లకి లభించిన ఊతం మరొకటి.
ఆ రకంగా నోట్లరద్దు ఉపయోగపడిందని మాత్రం నా భావన.
ఇప్పటిదాక వచ్చిన సాంకేతిక ఆవిష్కరణలు ఎక్కువ పాశ్చాత్యదేశాలలో వారి సమాజానికి అనుగుణంగా వచ్చినవి. ఈ నగదుచెల్లింపుల విప్లవం మాత్రం మన సమాజం నుంచి పుట్టినది. దీని గురించి తప్పక గర్వ పడవచ్చు. కొంత కృతజ్ఞత మోడీకి కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంకో ఏడాది తర్వాత రెండువేల నోట్ల రద్దు చేపడితే మంచి ఫలితం వస్తుందని ఆశించే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే అసలు 500 రూపాయల నోటు వాడాల్సిన అవసరమే కనపడనప్పుడు 2000 రూపాయల నోటురద్దు చేస్తే ఏమిటిట సమస్య? చాలా సులభంగా అమలు చెయ్యచ్చు. అంతవరకు అది సఫలమే.
ఐతే ఈ రకమైన విప్లవం రావడానికి ఇదొక్కటే మార్గమని కానీ, నోట్లరద్దు వల్ల ప్రజలకి నష్టం జరగలేదని కానీ నేను అనట్లేదు. పైగా – మోడీ మంచివాడా మోసగాడా, నిజంగా మంచి చేస్తాడా – ఈ విషయంలో నాకు ఎటువంటి విషయ పరిజ్ఞానం, దానివల్ల కలిగే అభిప్రాయం – పూర్తిగా లేవు. ఇది ఇంతవరకే.
సెప్టెంబర్ 8, 2020
భరతవర్షే, భరతఖండే…కృష్ణాగోదావరీ మధ్యప్రదేశే
భరతవర్షే, భరతఖండే అని సంకల్పం చెప్పించిన పెద్దలు నా విధేయతలు ఎక్కడ ఉండాలో చెప్పనే చెప్పారు. ఐతే అక్కడితో ఆగకుండా శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే కృష్ణాగోదావరీ మధ్యప్రదేశే అని కూడా చెప్పుకోమన్నారు.
అందుచేత భారతీయుడినైనందుకు ఎంత గర్వ పడతానో, తెలుగువాడిగా పుట్టినందుకు అంతగా సంతోషపడతాను.
అంతమాత్రం చేత నా భాషనే భారతీయులందరూ మాట్లాడాలనుకోను. ఎవరి స్థానిక సంస్కృతులు వాళ్ళవి. అవి ఒకరివొకరు గౌరవించుకోవలసిందే. పిల్లలకి ఆంజనేయ దండకంతో పాటు హనుమాన్ చాలీసా కూడా నేర్పడం నాకు ఎంతో ఆనందం.
ఇటువంటి భావనల వల్లే మన సమైక్యత వర్ధిల్లింది. ఉదాహరణకి తరతరాలుగా తెలుగునేలకీ వారణాశికీ ధృఢమైనబంధం ఉంది. అప్పటికి నేటి హిందీ భాషలేదు. సంస్కృతమే ఈ బంధాన్ని కట్టి నిల్పింది. ఎందుకంటే సంస్కృతం కేవలం భాషకాదు, అది మనందరి ఉమ్మడి వారసత్వం.
ఆ వారసత్వ భావనలేనప్పుడు, ఏదైనా పరాయిదానికిందే అనిపిస్తుంది. హిందీతో వచ్చిన చిక్కు ఇదే. ఐతే ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటున్నారన్నది ప్రశ్న. నాకనిపించేది ఏమిటంటే ఆంగ్ల భాష తన విలువని విద్యా, వైజ్ఞానిక,వాణిజ్యపరంగా పెంచుకుంది కనక. ప్రత్యేకించి ప్రస్తుత ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా వారు మాట్లాడే భాష కనుక. దాని వల్ల ప్రజలకి లౌకిక ప్రయోజనాలు కళ్ళముందే కనపడుతున్నాయి కనుక.
హిందీ భాష నేర్చుకోవడంవల్ల ఇటువంటి ప్రయోజనాలేవీ లేవు. లౌకిక ప్రయోజనాలు పక్కనపెట్టి చూసినా, సాంస్కృతికంగా కూడా దానికి ఎక్కువ విలువ కనపడదు. తెలుగు వంటి కావ్య సంపద, వారసత్వం దానికి లేదు. ఈ భాష మనుగడ మొదలయ్యే రెండు మూడు శతాబ్దాలైందేమో అంతే. అందుచేత బలవంతంగా ప్రజలకి ఎక్కించాల్సిందే. ఇంగ్లీషు ఉపాధ్యాయుడి గా పనిచేసే మా నాన్నగారు, మా చిన్నతనంలో హిందీ ప్రాధమిక, మధ్యమ పరీక్షలు వ్రాసారు – ఒక ఇంక్రిమెంటు కలుపుతారని. అది గుర్తొస్తుంది నాకు.
అందుచేత అనవసరపు హిందీ గొడవలలో కాలం వృధా చేయకుండా, ఆ వనరులన్నీ సంస్కృతానికి పూర్వ వైభవం తేవడానికి ఉపయోగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. సంస్కృతభారతి లాంటి సంస్థలు సాధిస్తున్న అధ్భుతాలు చూస్తే నాకు ఇది సాధ్యమే అనిపిస్తుంది. భారతదేశపు సత్తాని విశ్వవీధిలో చాటగలిగే సత్తా సంస్కృతానికి మాత్రమే ఉంది.
ఇంకొక్క విషయం గురించి వ్రాస్తాను. హిందీని ప్రోత్సహించడం వల్ల తెలుగు భాషకి ఏమి నష్టం అన్న ప్రశ్న. మామూలుగా ఐతే ఏమీ నష్టంలేదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల భాషా బోధనని ఆపే, నిరుత్సాహపరిచే పరిస్థితి లేదు. అందుచేత దానికి సమాన స్థాయిని ఇస్తేనే మాతృభాషలకి మనుగడ సాధ్యం. వేరే ఏ భాష ఐనా మాతృభాష తర్వాతి స్థానంలోనే ఉండాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వపు విధానాలుంటే రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి. లేకపోతే కూలీలుగా మారుతున్న తెలుగు ఆచార్యుల కధలు మనం ఇంకా ఇంకా చూడవలసి వస్తుంది. మహామహులైన ఎస్వీ జోగారావు గారి దగ్గర శిష్యురాలిగా పీహెచ్డీ పుచ్చుకున్న మా చిన్న అమ్మమ్మ గారు ఒక ఎయిడెడ్ కాలేజీలో కూలిపనులకి లభించే దానికన్నా తక్కువ వేతనానికి పనిచేసి పదవీ విరమణ చేయడం మా కుటుంబంలో నాకు అనుభవమే. ఇటువంటి పరిస్థితికి కారణం స్థానికభాషల పురోగతికీ, సంరక్షణకీ ఉపయోగపడేలా ప్రభుత్వ విధానాలు లేకపోవడమే. సెంట్రల్ బోర్డుని అనుసరిస్తున్న పాఠశాలలు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వ విధానాలు దీనికి సహాయపడట్లేదు. మాతృభాషల గురించి ఈ సెంట్రల్ బోర్డు వారికి ఏమీ పట్టదు (వీట్లలో కేంద్రీయ విద్యాలయాలది ఇంకా విపరీత ధోరణి. ఢిల్లీలో వర్షం పడితే వీళ్ళిక్కడ గొడుగులెత్తుతూ ఉంటారు).
చెప్పొచ్చేదేమిటంటే హిందీ నేర్పే ముందు పిల్లలు మాతృభాషని నేర్చుకునేలా చెయ్యడం ముఖ్యం అని. దేశ సాంస్కృతిక సమైక్యతకోసం సంస్కృతభాష మీద దృష్టి పెట్టమనీను.
ఆగస్ట్ 26, 2007
అమానుషం!
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగుప్రేమ నీలోన చచ్చెనేమొ?
అందమును హత్యచేసెడి హంతకుండ!
మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ!
మనిషి నిజంగానే అభివృద్ధి సాధిస్తున్నాడా? లేక మానవత్వాన్ని కోల్పోతున్నాడా?
For those in Hyderabad: Andhra Pradesh government has requested people to donate blood for blast victims. Helpline numbers are 040-23559555, 9948118765.
ఆగస్ట్ 12, 2007
తప్పెవరిది?
నేను రాసిన దాన్ని చూసి గురువుగారు ఒవైసీని సమర్ధిస్తున్నట్టు ఉందోయ్ అన్నారు. అందుకే ఈ వివరణ. నేను అనేది ఏమిటంటే ఒవైసీయే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా అదే పని చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటినుంచీ హైదరాబాదు ప్రాంతాలలో మజ్లిస్ ఏ ప్రాతిపదికన గెలుస్తోంది? కేవలం మతం అడ్డుపెట్టుకు నెగ్గుకొస్తోంది తప్ప, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముంది? మతం వారికి బంగారు గుడ్లు పెట్టే బాతు. దానిని వాడుకుంటున్నారు. ఇది కేవలం మజ్లిస్ కే పరిమితం కాదు. మన దేశం మొత్తం మీద ఉన్న పరిస్థితి ఇదే. మన కులం వాడనో, మన మతం వాడనో, మన ప్రాంతం వాడనో తప్పితే, అభ్యర్ధి నిజమైన అర్హత ఉన్నవాడా కాదా అన్నది ఎవరకీ అక్కర్లేదు. అభ్యర్ధులని నిలబెట్టే విషయంలో కూడా పార్టీలు ఇవే విషయాలు ఆలోచిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి.
ఒవైసీ గారికి కూడా అదే నమ్మకం. అందుకే ఈ పని చేస్తే తప్పకుండా నెగ్గుతాననుకున్నాడు. చేసాడు. ఈ సారి భారీ మెజారిటీతో మజ్లిస్ గెలుపు ఖాయం చూస్కోండి.
అంతే కాదు, తామేం చేసినా ఎవరూ ఏమి చెయ్యలేరనీ, ప్రభుత్వానికి తామంటే భయమనీ ఈయన విశ్వాసం. అది నిజమేనని మనకి ఋజువయ్యింది కూడా. ఇంక ఆయన దేనికి వెనకాడాలి?
నా ఉద్దేశంలో కాంగ్రెస్సు వాళ్ళూ, వారికి మద్దతిస్తోన్న వామపక్షాల వాళ్ళూ దీనికి అసలైన కారకులు. మైనారిటీలని ఓటుబేంకుగా వాడుకుంటూ ఇలాంటి నాయకులని నెత్తికెక్కించుకుని వాళ్ళు ఆడినది ఆటగా జరగనిచ్చింది వీళ్ళే. ప్రభుత్వం ఎంత లోకువకాకపోతే మజ్లిస్ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించగలిగారు. తమనోటికొచ్చినట్టు మాట్లాడి ఇంకా ధైర్యంగా స్వేచ్చగా తిరుగుతున్నారంటే, ప్రభుత్వం చేతకానితనం కాదా? ఇప్పుడు వీళ్ళని ఖాసిం రజ్వీ వారసులంటూ వ్యాసాలు రాస్తున్న వామపక్షాలవాళ్ళకి ఇప్పటిదాకా ఈ విషయం గుర్తులేదా? అందుకే నాకు ఒవైసీలోకన్నా వాళ్ళకి లోకువైన వీళ్ళలోనే ఎక్కువ తప్పు కనిపించింది. దీనిగురించే నేను నఫీసా ఆలీ గారిని చూసి నవ్వుకున్నది. అంతేకానీ ఒవైసీ పనిని సమర్ధించి కాదు.