సంగతులూ,సందర్భాలూ….

ఆగస్ట్ 29, 2007

మరింత వినోదం…

వయ్యస్సార్ ని రీడిఫ్ వాడు ప్రశ్నలు వేసాడు. వాళ్ళకేం తెలుసు, ఈయనకి మీడియా అంటే కోపం అని. అప్పటిదాకా బానే ఉన్నాయన చివరలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగగానే ఎలా మారిపోయాడో. పాపం షీలా భట్!

ఆగస్ట్ 26, 2007

అమానుషం!

Filed under: Uncategorized — Sriram @ 3:29 సా.

బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగుప్రేమ నీలోన చచ్చెనేమొ?
అందమును హత్యచేసెడి హంతకుండ!
మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ!

పుష్పవిలాపము, కరుణశ్రీ.

మనిషి నిజంగానే అభివృద్ధి సాధిస్తున్నాడా? లేక మానవత్వాన్ని కోల్పోతున్నాడా?

For those in Hyderabad: Andhra Pradesh government has requested people to donate blood for blast victims. Helpline numbers are 040-23559555, 9948118765.

ఆగస్ట్ 23, 2007

ఇత్యర్ధలు కూరా, ఇతిభావలు పులుసూ…

అనగనగా గోదావరీ తీరాన ఒక గ్రామంలో ఒక వేదపండితుడు. మహా జ్ఞాని. పొద్దునే లేచి స్నానం,సంధ్యా కానిచ్చి అనుష్ఠానం,స్వాధ్యాయం(సెల్ఫ్ స్టడీ) చేసుకోడం – ఆ తర్వాత విద్యార్ధులకి వేదమూ, “ఇత్యర్ధః (ఇదీ దీని అర్ధం), ఇతి భావః (ఇదీ దీని భావము)” అంటూ దానికి అర్ధమూ పాఠాలు చెప్పుకోడం – ఇదీ ఆయన దైనందిక జీవితం.  

ఉన్న కాస్త భూమిలో పండే గింజలూ, పెరట్లో పండే కూరలూ ఆ కుటుంబానికి భోజ్యం.

ఎప్పుడూ బయటకెళ్ళి రూపాయి సంపాదించిన వ్యక్తి కాదు. ఆయనకి అవసరం కూడాలేదు.

కానీ భార్యకి మాత్రం కాస్త బాధగా ఉండేది. ఔను మరి ఇంట్లో ఏ పూటకి ఏముంటుందో కూడా తెలీదు, ఈవిడేగా అవన్నీ పడవలసింది. ఆయనకేమీ పట్టదాయె.

ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఇంటిల్లాలు వాకిట్లో ముగ్గు వేస్తుండగా మన పండితులుంగారు సరసంగా అరుగుమీద నిలబడి “ఈ పూట వంటకాలేమిటోయ్” అంటూ ప్రశ్నించారు. మంచి విసుగులో ఉందేమో ఆవిడ, ” ఏముందీ, ఇత్యర్ధలు కూరా ఇతిభావలు పులుసూ” అని పెడసరంగా సమాధానం చెప్పిందిట. 

పాపం ఈయనకి కలుక్కుమంది. ఔరా! భార్య చేత ఇంత మాట పడ్డాను కదా అనుకుని, దగ్గరకు పిలిచి – నీకేవో కోరికలున్నట్టున్నాయి, ఏం కావాలో చెప్పమని అడిగాడుట. పాపం ఆ వెర్రి ఇల్లాలు చేతులో ఉన్న ముగ్గు చెంబు ఈయన చేతిలో పెట్టి దీన్నిండా బంగారపు కాసులు తెచ్చిపెట్టండి, ఇంకేమీ అడగను అన్నదిట.

సరే అని మర్నాడు ఆ ముగ్గు చెంబుతో బయల్దేరాడీయన. రాజధానికి వెళ్ళేసరికి అక్కడ రాజుగారు ఏదో సమస్యలో ఉన్నారు. ఎవ్వరూ ఏమీ చెప్పలేకున్న సమయంలో ఈయనకున్న శాస్త్రజ్ఞానాన్ని అన్వయించి ఇట్టే చిక్కుముడి విడగొట్టాడు.

రాజుగారు ఉబ్బితబ్బిబ్బై ఏం కావాలో కోరుకోమన్నారు. ఈయన వెంటతెచ్చిన ముగ్గు చెంబు రాజుగారి చేతిలో పెట్టి దీన్నిండా బంగారు కాసులు కావాలి అని అడిగాడు. రాజుగారు ఇదేం కోరికయ్యా ఏ అగ్రహారాలో కోరుకోక అని అనేసరికి ఈయన మహాప్రభో! ఇది నా భార్య కోరిక గానీ నాకేమీ కోరికలు లేవు అని చెప్పి ఆ చెంబుడు కాసులు పట్టుకొచ్చి భార్యకిచ్చాడుట.

ఇది చిన్నప్పుడు విన్న కధ. ఈ వారం ఈనాడులో వేదాన్ని తెలుగులో అనువదించిన దాశరధి రంగాచార్యులు గారి గురించిన వ్యాసం చదివినప్పుడు ఇది మళ్ళీ గుర్తొచ్చింది.

ఈ కధలో వినడమే కాదు, నేను ప్రత్యక్షంగా చూసిన చాలా మంది వేదపండితులు “ఇత్యర్ధలు కూర, ఇతిభావలు పులుసూ” గా కాలక్షేపం చేసిన వాళ్ళే.

అందుకే, దాశరధిగారు ఆయన అనువాదం ఎందుకు చేసానో చెప్తూ, “వేదం ఒక వర్గానికి ఉపాధి, అందులో ఆధిపత్యం పోతుందని భయం” కనకనే అందరికీ వేదం నేర్పలేదంటూ చేసిన వ్యాఖ్యలు నన్ను కాస్త బాధ పెట్టాయి.

నా అభ్యంతరమల్లా, వేదం జీవనోపాధికి మార్గమా అని? వేదపండితులంటే పెళ్ళిళ్ళు చేయించే పురోహితులూ, ఆలయాల్లో అర్చకులూ కాదే! ఈ సంగతి ఆచార్యుల వారికి తెలియదా?  కేవలం వేదాధ్యయనం వల్ల ఎటువంటి డబ్బు సంపాదన చెయ్యగలరు?

ప్రతిచోటా మంచీ చెడూ ఉంటాయి. మనసంస్కృతి కూడా అంతే. కానీ నేను గర్వపడే విషయాల్లో మన సత్సంప్రదాయాల్లో ముఖ్యమైనది ఒకటుంది. జ్ఞానము, అన్నము – ఈ రెండింటినీ అమ్ముకోడం పాపం. మనదేశంలో జరిగినంత విద్యాదానం, అన్నదానం ప్రపంచంలో ఎక్కడా జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.

మరి వేదమంటే కేవలం జ్ఞానమే! దానిని డబ్బు సంపాదనకి వాడడం మన పూర్వీకులు మహాపరాధమని భావించారే! అలాంటి వేదాన్ని జీవనోపాధి అనడం సబబు కాదని అనిపించింది. 

వేదాన్ని అందరికీ బోధించకపోడానికి ఏమి కారణమో నాకు ఖచ్చితంగా తెలీదు. నా అభిప్రాయం ఇదివరకు ఒకసారి రాసాను. వేదపండితులంతా చెడ్డవాళ్ళూ, బిల్ గేట్స్ లాంటి వాళ్ళూ అని అన్నా నేను అది ఆయన అభిప్రాయం అని ఊరుకుందును. కానీ వేదవిద్య ఇలా డబ్బు సంపాదనకి మార్గం కాదని మాత్రం చెప్పగలను.   

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః   

ఆగస్ట్ 18, 2007

స్వాతంత్ర్య ఫలాలు

Filed under: కబుర్లు,భారతదేశం — Sriram @ 1:26 సా.

ఈ మధ్యనే మన అరవయ్యో స్వాతంత్ర దినోత్సవం గట్టిగా జరిపేసుకున్నాం. బ్లాగుల్లో కూడా చాలామంది సందడి చేసారు. కానీ ఈ స్వాతంత్ర్యానికి సార్ధకత ఎంత వరకూ అంటూ గాఢ నిట్టూర్పులు విడిచిన వాళ్ళే ఎక్కువ. వీళ్ళందరినీ చూసి నేను కూడా కొంత సందిగ్ధంలో పడ్డాను కానీ, ఈరోజు బయటపడ్డ ఈ వార్త నా సందేహాన్ని పటాపంచలు చేసింది.

స్వతంత్ర భారత న్యాయశాఖామంత్రివర్యులు నెహ్రూ కుటుంబానికి మన స్వాతంత్ర ఫలాలు రుచిచూపించారు. స్వయంగా ఖత్రోచిని ఇంటిదగ్గర దిగబెట్టి వచ్చారు.

ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? నెహ్రూ కుటుంబం తింటే ప్రజలందరూ తిన్నట్టే కదా.  తెలియకపోతే మన రాజ్ ని చూసి తెలుసుకోండి.

ఆగస్ట్ 17, 2007

టెల్గూ అంత వీజీయా…!

Filed under: కబుర్లు,భాష — Sriram @ 12:44 సా.

చిన్నప్పటినుంచీ నేను ఎక్కువగా చదివిన వార్తాపత్రిక “ఈనాడు”. పత్రిక రాగానే మొదటి పేజీని ఒక చూపుచూసి వెంటనే వెనక్కి తిప్పి క్రీడా వార్తలు చదవడం నాకు అలవాటు. అప్పట్లో క్రికెట్ అంటే కొంచెం ఎక్కువ పిచ్చే ఉండేది. దూరదర్శని మాధ్యమం ఇప్పట్లా అభివృద్ధి చెందలేదు కనక ఎక్కువగా వార్తలకోసం పత్రికల మీదే ఆధారపడేవాళ్ళం.

“పీకల్లోతు కష్టాల్లో భారత్”, “భారత్ ఘోర పరాజయం” వంటి వార్తలే ఐనా ఎంతో ఆసక్తిగా చదవడం అలవాటయ్యింది అలాగే. అదే అలవాటున ఈరోజు పత్రిక తిరగెయ్యగానే “చాలా వీజీగా…” అంటూ భారత్-స్కాట్లేండుల మధ్య జరిగిన పోటీ గురించిన వార్త కనపడింది.

ఏంటో కొంచెం తేడాగా అనిపించింది. ఈనాడేనా చదువుతున్నది అని ఒక సందేహం. ఇంతలో నాలోంచి ఇద్దరు వ్యక్తులు బయటకి వచ్చి ఒకళ్ళు కుడివైపు ఇంకొకళ్ళు ఎడమ వైపు నిలబడ్డారు.

కువ్య: అసలు ఏమిటీ ఘోరం? తెలుగు పత్రికేనా ఇది? అసలు పత్రికేనా అని! ఏమి భాష ఇది, వీజీ అంటే?

ఎవ్య: ఘోరంలేదు, ఏమీ లేదు.ప్రజలకి చేరువయ్యేదే నిజమైన  భాష.

కువ్య: చేరువవ్వడం అంటే? “సులువుగా” అని వాడితే చేరువవ్వదా? మాతృభాష చేరువవ్వదు కానీ పరభాష చేరువౌతుందా! ఐనా పత్రికల్లో భాషన్నాకా కాస్త ప్రమాణాలు ఉండద్దా? భాష పట్ల ఆ మాత్రం బాధ్యత లేదా వాళ్ళకి? 

ఎవ్య: ప్రజలు వాడట్లేదా “వీజీగా” అని? పత్రికలో వాడితే తప్పేంటి? మీ లాంటి ఛాదస్తపు వాళ్ళ వల్లే తెలుగు ప్రజలకి దూరమౌతోంది.

కువ్య: ఔనా! ప్రజలు వాడేవన్నీ పత్రికల్లో వాడేస్తారా? వ్యావహారికంలో అనేక పదాలుంటాయి. కొన్ని కొన్ని అసభ్య పదాలు కూడా విరివిగా వాడుతూ ఉంటారు. అవన్నీ పత్రికల్లో వాడేస్తారా? ఆంగ్లపత్రికల విషయంలో ఇలానే మాట్లాడతావా? ప్రజలు మాట్లాడే బూతులుబుంగ ఇంగ్లీషు, పత్రికల్లో వాడితే ఒప్పుకుంటారా? “ది హిందూ” ఐతే మంచి భాష వాడుతుంది అని తెగ ప్రశంసిస్తూ ఉంటావుగా ఎప్పుడూ. ఇంగ్లీషుకొక నీతి, తెలుగుకొక నీతీనా?   

ఎవ్య: అర్ధంలేని ఆరోపణలు చెయ్యకు. ఎప్పుడూ పాతచింతకాయ పచ్చడిలా ఆలోచిస్తావు. ప్రజలభాష వాడడంద్వారా ప్రజలని గౌరవిస్తున్నామని తెలుసుకో. నీకులా మడిగట్టుకు కూచోడం ప్రజలని అవమానించడమే ఔతుంది.

కువ్య: ఆహా! అసలు వీజీగా అన్నపదం ఎలా పుట్టిందో తెలుసా? చదువులేని వాళ్ళ భాషని వెక్కిరించడానికి కొంతమంది వెటకారంగా వాడడం మొదలెడితే అది మొత్తం అందరి నోళ్ళలోకీ వచ్చింది. ఆ పదం వాడి మీరు కూడా అదే పని చేస్తున్నారు. అది తెలుసుకో!

ఇంక నావల్ల కాలేదు, ఈ గోల భరించడం. ఇద్దరినీ చెరోచెయ్యీ పట్టుకుని లోపలికి లాగేసుకున్నా. నిన్నరాత్రి జీతెలుగు లో చూసిన “స రి గ మ ప” పాటలపోటీ కార్యక్రమం గుర్తొచ్చింది. జీవారు ఈ పోటీ అన్నిభాషలలోనూ నిర్వహిస్తున్నారు. పోటీ తర్వాత ఇద్దరు పోటీదారులని “డేంజర్ జోన్” లోకి పంపు తారు. జీతెలుగు లో నవగాయకుడు కారుణ్య దీనికి సూత్రధారి. నిన్న కార్యక్రమంలో “డేంజర్ జోన్” కి బదులు “ప్రమాద వలయం” అని వాడాడు. నాకు “భలే” అనిపించింది. ఈయన మధ్యమధ్య ఒకటి,రెండు ఇంగ్లీషు వాక్యాలు వాడతాడు కానీ చక్కని తెలుగు మాట్లాడుతాడు. మరి ప్రజలెంతవరకూ ఆదరిస్తారో!   

తర్వాత పేజీ »