సంగతులూ,సందర్భాలూ….

మే 29, 2007

తెనాలి రాముడి వికటకవిత్వం, నా పైత్యం!

తెనాలి రాముడి పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి చిన్నప్పుడు విన్న చమత్కారపు కధలూ అందులోని హాస్యమూను. నిజానికి ఇలా పిల్లలని ఆకట్టుకునే చారిత్రక పాత్రలు మనకి చాలానే ఉన్నాయి. బీర్బల్, మర్యాద రామన్న వగైరాలు. కానీ తెనాలి రాముడి ప్రత్యేకత ఏమిటంటే ఆయన పిల్లలతో పాటు పెరుగుతూ వస్తాడు. అమ్మ వారి చేతుల్లోని రెండు గిన్నెల్లో పాయసమూ తాగేసిన కధ వినే వయసు దాటేసరికి గూని చాకలి వాడి కధ దొరుకుతుంది. ఇంకొంచెం పెద్దయ్యేప్పటికి భావతురంగం కధ ఆకట్టుకుంటుంది. ఇంక కధలు వినే వయసు దాటేసరికి ఆయన చాటువులు, సమస్యా పూరణలూ ఆస్వాదించమని ఆహ్వానిస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం అభిరుచి, చెప్పేవాళ్ళు ఉండాలి. ఇక ఈ స్థాయి దాటితే పాండురంగమహత్యం చదవచ్చు.

ఇలా ఆబాలగోపాలన్నీ ఆకట్టుకునే తెనాలి రాముడి వికటకవిత్వపు విన్యాసాలలో ఒక సమస్యా పూరణ నాకు ఈ మధ్య రాఘవ గారి బ్లాగు ద్వారా గుర్తొచ్చింది. ఇది ఏదో ఒక సినిమాలో కూడా విన్న గుర్తు (ఆదిత్య 369 అనుకుంటా). సమస్య ఏమిటంటే

బలరాముడు సీతజూచి ఫక్కున నగియెన్!

అడిగేవాడికి చెప్పే వాడు లోకువని కాకపోతే, ఎక్కడో త్రేతాయుగంలోని సీతమ్మవారిని ద్వాపరయుగంలోని బలరాముడు చూడడమేమిటి! పైగా చూసి ఫక్కుమని నవ్వేడు కూడాట. ఇదంతా ఎలా సరిపెట్టాలి? చూడటానికి అసంబద్ధంగా ఉన్నా ఈ సమస్యలో ఒక అందం ఉంది. అది కవికి మాత్రమే కనపడుతుంది. అందుకే తెనాలి రాముడు ఇలా పూర్తి చేసాడు:

లలనలు పాయస మానిన
కలుగుదురే బిడ్డలంచు క్ష్మాసుతనవ్వన్  
పొలమున దొరికెదరని ధీ
బలరాముడు సీత జూచి ఫక్కున నగియెన్!

చోద్యం కాకపోతే ఎక్కడైనా ఆడవాళ్ళు పాయసం తింటే పిల్లలు పుడతారా అని సీతమ్మవారు శ్రీరాముడిని వేళాకోళం చేస్తే, బుద్ధిబలుడైన రాముడు “కాదులే పొలాల్లో దొరుకుతారట” అని తానేమీ తక్కువ కాకుండా సమాధానం ఇచ్చాడుట.

ఇంత అందమైన భావనలతో హాస్యాన్ని పండిచాడుకనకనే ఆయన మన తెలుగు వారిలో హాస్యానికి మరో పేరుగా నిలిచిపోయాడు.

బలరాముడిని ధీబల రాముడి గా మార్చేసుకోడం కుదిరింది కాబట్టి ఆ పై మూడు పాదాల్లోనూ అద్భుతమైన భావాన్ని నింపి ఒక గొప్ప పద్యంగా ఆ సమస్యని పూరించాడు తెనాలి రాముడు.

ఐతే అన్నిసార్లూ ఇలాంటి వెసులుబాటు ఉండదు. ఉదాహరణకి రాఘవగారు ఈ మధ్య ఇచ్చిన సమస్య:

రావణు చెల్లి ద్రౌపదిని రాముడు యెత్తుకు పోయె చక్కగా

ఈ సమస్యని ఎలా మార్చినా ఒక అర్ధవంతమైన పద్యం చెప్పడం కష్టం. తెనాలి రాముడి లాంటి కవుల సంగతేమో కానీ నాబోటి వారి వల్ల అయ్యే పని కాదు. ఇలాంటప్పుడు ఆపద్భాంధవుడిలా ఆదుకునేది క్రమాలంకారం. ఉదాహరణకి నా పూరణ చూడండి:

కావరమొంది రామునికి కామము దెల్పినదెవ్వరు? ద్యుతిన్
పావకుడిచ్చెనెవ్వరిని పార్ధుని మామకు? కష్టమందు సు
గ్రీవుని గాచెనెవ్వరది?కృష్ణుడు రుక్మిణినేమి చేసెనో?
రావణుచెల్లి, ద్రౌపదిని, రాముడు, యెత్తుకు పోయె చక్కగా !

వరుసగా కొన్ని ప్రశ్నలు, అదే వరుసలో వాటికి సమాధానాలు.

ప్రశ్నలూ సమాధానాలూ చూడండి:

1. పొగరెక్కి శ్రీరాముడి వద్ద కామాన్ని కోరినది ఎవరు? రావణు చెల్లి (శూర్పణఖ)
2. పావకుడు (అగ్ని) మంచి కాంతితో, పార్ధుని (అర్జునుడి) మామగారికి ఎవరినిచ్చాడు? ద్రౌపదిని, ఆవిడ యజ్ఞగుండంలోంచి పుట్టింది.
3. సుగ్రీవుడు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసింది ఎవరు? శ్రీరాముడు
4. కృష్ణుడు రుక్మిణిని ఏమి చేసాడు? చక్కగా ఎత్తుకుపోయాడు

ఇలా ముప్పతిప్పలూ పడి ఈ ఉత్పలమాలని పూర్తి చెయ్యవలసి వచ్చింది. రాఘవగారికి నా పూరణ నచ్చుతుందని ఆశిస్తూ, తెనాలి రాముడి పద్యం కింద నా పద్యం రాసినందుకు ఆ మహాకవికి క్షమాపణలు తెల్పుకుంటున్నాను.

మే 9, 2007

ఫలరాజం!

Filed under: కబుర్లు,తెలుగు పద్యం — Sriram @ 12:20 సా.

వేసవికాలం వచ్చిందంటే చాలు, ఆంధ్రదేశంలో ఏ ప్రాంతం నుండి బయలుదేరే రైలు ఎక్కినా మనలని స్వాగతించేవి మామిడి పళ్ళ ఘుమఘుమలూ, బెర్తులమీద ఆవకాయ డాగులూ! విశ్వవ్యాప్తమైన తెలుగువాడి “వాడికి” ఈ రెండు పదార్ధాలూ ముఖ్యకారణమని నాకు అనిపిస్తుంది. “వాడి” సంగతేమో కానీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయని గిట్టనివాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు కానీ అది మనం పట్టించుకోవలసిన విషయం కాదు. ఈ విషయంలో నాకు మా పక్కింటి దివాకరం గాడు ఆదర్శం. ఒకేరోజు పరకన్నర మామిడి పళ్ళు ఫలహారం చేసిన రికార్డు మా ఊళ్ళో ఇంకా వాడి పేరు మీదే పదిలంగా ఉంది.

ఇంతకీ ఈ పరక అంటే ఏమిటన్న సందేహం కొంతమందికి రావచ్చు. కుదిరితే కొబ్బరి బొండాలు కూడా కేజీల లెక్కన అమ్ముదామని చూసే హైదరాబాదు లాంటి నగరాలలో ఈ పదం తెలియకపోవడం చిత్రమేమీ కాదనుకోండి. పరక అంటే పన్నెండు పళ్ళు. దానికి కొసరుగా రుచి చూడడానికి ఒక పండు. అంటే మొత్తం పదమూడు అన్నమాట. అసలు మామిడి పళ్ళు తినడమే కాదు, కొనడం కూడా మహా సరదాగా ఉండేది. వీధిని వచ్చిన ప్రతీ మామిడిపళ్ళ బుట్టనీ ఆపడం, వాడితో బేరాలు, తరవాత రుచి చూడడం కోసం పోటీలూ…అంతా అయ్యాకా ఎండవేడికి బాగా వేడెక్కిన ఆ పళ్ళు తీసుకొచ్చి నీళ్ళ తొట్టిలో వెయ్యడం…ఇదంతా అనుభవేకవేద్యమైన ఆనందం. 

ఇదికాక, ఇంట్లో మామిడి పళ్ళు ముగ్గించడం అనేది మరొక విశిష్టప్రక్రియ. కొట్టుగదినిండా గడ్డిపరచి, దాని మీద పొరలుగా మామిడికాయలూ, గడ్డీ పేర్చుకుంటూ వెళ్ళడం, తరువాత మామిడి పళ్ళు కుళ్ళిపోకుండా సరైన సమయంలో వాటిని బయటికి తియ్యడం అంతా ఒక పెద్ద శాస్త్రమే. పిల్లకాయలు మాత్రం అవి త్వరగాముగ్గాలని ఆ గది బయటే తపస్సు చేస్తూ ఉండడం బాల్యంలోనే ఒక మధురమైన విరహం,ఎదురుచూపు. 

ఇక ఈ మామిడిపళ్ళలో రకాలు ఇన్నీ అన్నీ కాదు.  హైదరాబాదులోనే కాక, విశ్వ విఖ్యాతమైన బంగినపల్లి మామిడిపండు గొప్పతనం నేను చెప్పక్కల్లేదు. విశాఖపట్నం బీచ్ లో కలెక్టరు మామిడి కాయ ముక్కలు కారంలో ముంచుకు తినడం, అదొక యోగం అనే చెప్పాలి. ఇంక దక్షిణ కోస్తా జిల్లాలలో దొరికినన్ని రకాలు ఇంకెక్కడా దొరకవేమో. నూజివీడు రసాలు, పెద్ద రసాలు, సువర్ణ రేఖ లాంటివే కాకుండా కొత్తపల్లి కొబ్బరి,పాపయరాజు గోవా,పంచదార కలశ లాంటి స్థానిక రకాలు నోరూరిస్తూ ఉంటాయి.

చిన్నప్పుడు మా మాస్టారు తీసుకెళ్ళిన క్విజ్ పోటీలో “రస రాజం అని దేనినంటారు?” అని అడగగానే నేను అత్యుత్సాహంతో బజర్ నొక్కి “మామిడి రసం” అని సమాధానం చెప్పగానే అందరూ నవ్వారు కానీ, మా మాస్టారు మాత్రం ఆ విషయంలో నా అజ్ఞానానికి ఆనందపడ్డట్టే నాకనిపించింది. రసరాజం సంగతి అలా ఉంచితే, కవులుఅందులోనూ తెలుగు కవులు మాత్రం మామిడిని ఫలరాజం అనే పొగిడారు. నా చిన్నప్పుడు నేర్చుకున్న ఈ మత్తేభ పద్యం చూడండి:

ఫలచూడామణి చూతమెల్లయెడలన్ భాసిల్ల జంబూఫలం

బులు నల్లబడె లజ్జ, కొబ్బరిఫలంబుల్ భీతి నీరయ్యెలో

పల వృక్షంబుల మీద నుండియున్, కోపస్ఫూర్తి శూలాళి రొ

మ్ముల జిందెన్ పనసంబు, దాడిమ ఫలంబుల్ వ్రక్కలయ్యెన్ హృదిన్!

పళ్ళలో చూడామణిగా మామిడి పండు ప్రసిద్ధి పొందడంతో నేరేడు పళ్ళు లజ్జతో ముఖం మాడ్చుకుని నల్లగా అయ్యాయిట. కొబ్బరి కాయ అంత ఎత్తున ఉండి కూడా లోపల నీరు కారిపోయిందిట. కోపమూ, అసూయ పెరిగి పనసపండు ఒళ్ళంతా శూలాలు గుచ్చుకుందిట. ఇంక దానిమ్మ పండు మధ్యలోకి బద్దలయ్యిందిట.(తెలియని పదాల అర్ధాలు తెలుసుకోడానికీ, మీ తెలుగుని మెరుగు పరుచుకోడానికీ, నేడే చూడండి! మీ అభిమాన ఆన్లైన్ వెర్షన్లో! బ్రౌన్ నిఘంటువు) 

పద్యంలో చమత్కారం బాగుంది కదూ! ఈ అందమైన పద్యం రాసింది వడ్డాది సుబ్బరాయ కవి గారు. ఈయన రాజమహేంద్రవరంలో ఉండేవారుట. భక్త చింతామణి అనే శతకం ఒకటి ఈయన రచించారని గుర్తు.

మామిడి పండుని తలుచుకోగానే ఇన్ని సంగతులు గుర్తొచ్చాయి. దాని మహిమ అలాంటిది. కానీ ఈ మధ్య సరైన మామిడిపండు తినే చాలారోజులైంది. ఈ సారైనా మంచిపళ్ళు మార్కెట్లోకి వస్తాయేమో చూడాలి. 

మే 4, 2007

నేను సైతం…(55 పదాల్లో)

Filed under: కబుర్లు — Sriram @ 12:27 సా.

“పురుషాహంకారం! నాకు ఇష్టం లేదంటే వినరేం?”

“అది తప్పనిపిస్తోంది…భర్త మాట వినడం ధర్మం అనుకో కనీసం…”

“ఈ ధర్మపన్నాలు నాకు చెప్పకండి.రాముడు సుఖపడ్డాడా…రావణుడు సుఖపడ్డాడా? ఎందుకొచ్చిన ధర్మం?”

“ఇప్పుడు ఈ చర్చ అవసరమా?”

“సర్లెండి. అక్కడ హాల్లో పిల్లలు గోల చేస్తున్నారేమిటో చూడండొకసారి..”

“ఏముందీ…బుజ్జిగాడు వాళ్ళక్క దగ్గర చాక్లేట్ లాక్కున్నాడుట. అది ఏడుస్తోంది…”

“మీరు చేసిందే…మగ పిల్లాడు కదా అని గారం. తప్పురా అని చెప్పి రెండు తగిలించరు ఎప్పుడూ…”