తెలుగులో మనకి నెలల పేర్లు ఉన్నా, ఈ రోజుల్లో లౌకిక వ్యవహారాలలో వీట్లని మనం అనుసరించకపోవడం వల్ల, ఏ నెల ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనకి తెలీదు. కానీ వీటికి ఉన్న ఒక మినహాయింపు ఆషాఢమాసం. దానికి కారణం ఆషాఢమాసం పేరుతో దండిగా వ్యాపారం చేసుకునే బట్టల దుకాణాలవాళ్ళ వ్యాపార ప్రకటనలే.
ఈ సంవత్సరం ఆషాఢమాసం వచ్చిందని తెలియగానే నాకు మేఘసందేశం సినిమాలోని ఈ పాట గుర్తొచ్చింది. దానితో కాళిదాసు మేఘసందేశం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. ఉండబట్టలేక సాహిత్యం గూగుల్ గుంపులో అడిగేసరికి పద్మ గారు ఆ కావ్యం గురించిన వివరాలు అందచేసారు.
ఆవిడ మాటల్లో : “మేఘదూతా కావ్యానికి తెలుగులో అతి చక్కని, సరళమైన వ్యాఖ్యానం రాసింది రామవరపు శరత్ బాబు, శోంఠి శారదాపూర్ణ గార్లు. వీళ్లిద్దరూ విశ్వనాథవారికి శిష్య ప్రశిష్యులు, వరుసగా. ఈ పుస్తకంలో ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలే కాకుండా, పదచ్ఛేద, అన్వయాలు, “శ్రీకాళా” వ్యాఖ్య కూడా ఉంది. ఆనందలహరి, విశాఖపట్టణం వారి ప్రచురణ. ఈ పుస్తకం నేను ’98 లో అట్లాంటాలో జరిగిన మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో కొన్న గుర్తు. విశాలాంధ్రలో కూడా దొరకచ్చు.”
ఈ వివరం చూసి నేను ఆన్లైన్ గ్రంధాలయంలో వెతికితే శరత్బాబుగారి పుస్తకం దొరికేసింది.
మేఘదూతం కావ్యాన్ని చదవాలనీ, కాళిదాసు “ఉప్మా” రుచి చూడాలనీ ఆసక్తి ఉండి, సంస్కృతానికీ గ్రాంధికానికీ భయపడే నాలాంటి వాళ్ళకి గొప్ప కానుక ఈ పుస్తకం. ప్రతీ శ్లోకానికీ సరళమైన వ్యావహారిక భాషలో అర్ధం,వ్యాఖ్యానం ఉన్నాయి. దీనివల్ల కావ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలగడమే కాక, మన భాషాజ్ఞానాన్ని కూడా పెంచుకోగలుగుతాం. ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావాలని నా ఆశ.