సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 25, 2020

తెనాలి రాముడి దేవీ ఉపాసన

పూర్వకవులలో అమ్మవారి సాక్షాత్కారం పొందినట్టుగా మనం చెప్పుకునేవాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరూ చాలా పేరు పొందినవాళ్ళే. ఒకరు సంసృతకవి కాళిదాసు కాగా ఇంకొకరు మన తెనాలి రాముడు.

వీళ్ళిద్దరూ రచించిన గ్రంధాలేవీ అమ్మవారికి సంబంధించినవి కావు. కానీ కాళిదాసు పేరువల్ల, రచించిన శ్యామలాదండకం, అశ్వధాటి, లఘుస్తుతి వంటివాటివల్ల ఆయన దేవీ ఉపాసకుడని మనకు కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. మరి తెనాలివారి సంగతి? ఈయన శైవుడా, వైష్ణవుడా – రామకృష్ణుడా లేక రామలింగడా అని కొంత చర్చ జరిగింది కానీ దేవీ ఉపాసన గురించిన విషయాలు ఎవరూ చర్చించినట్టులేదు. ఐతే అమ్మవారు కనిపించి పాలగిన్నా పెరుగుగిన్నా అని అడగడం, ఈయన రెండూ కలుపుకు తాగెయ్యడం కట్టుకధేనా? కధ సంగతి పక్కన పెట్టినా, అసలు ఈయన దేవీ ఉపాసకుడా కనీసం? చిన్న పరిశోధన చేద్దాం.

తెనాలి రాముడి కవిత్వం,పాండిత్యం ఎంత గొప్పవైనా ఆయన హాస్యచతురత ఇంకా ఎంత గొప్పదంటే, ఇన్ని వందల సంవత్సరాల తర్వాతకూడా ఆయన హాస్యమే ప్రజలని ఆకర్షిస్తూ ఉంది. అమ్మవారే వికటకవిగా దీవించారని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఋజువుకావాలి?

ఐతే తెనాలి రాముని కవిత్వం, ఆయన రాసిన పాండురంగమహత్యం కొద్దిగా పరిశీలిస్తే ఆయన అద్వైతుడని వెంటనే తెలుస్తుంది. కావ్యారంభంలో లక్ష్మీ నారాయణులతో పాటు, శివపార్వతులని కూడా స్తుతించాడు. పైగా ఈయన ఎంత స్థితప్రజ్ఞుడంటే ప్రార్ధన కూడా, తనకోసం, తనకావ్యం కోసం చెయ్యలేదు. కృతి ఇచ్చిన విరూరు వేదాద్రి మంత్రి కోసం చేసాడు. ఈ వేదాద్రిగారు ఎవరయ్యా అంటే ఒక వ్రాయసకాడు. అంటే గ్రంధాలని తాటియాకుల మీద వ్రాసే పని చేసేవాడు. ఒక కృతిని అంకితం ఇవ్వడానికి ఇంతకన్నా అర్హుడు ఎవరుంటారు? ఐతే ప్రజలకి ఇందులో కూడా హాస్యమే కనపడింది. రాసేవాడికి అంకితం ఇస్తే ఆయనే బోలెడు ప్రతులు రాసిపెడతాడు కదా అని తెనాలి రాముడి ఆలోచన అన్నారు.

విషయానికి వస్తే, తెనాలి రాముడి దేవీ ఉపాసన గురించిన ఆధారం పాండురంగమహత్యం మొదటలోనే కనిపిస్తుంది. నాల్గవ పద్యం, ఈయన చేసిన సరస్వతీ ప్రార్ధన:

కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబినీ చంద్రికా
జిద్రూపాంచిత పద్మగర్భ ముఖ రాజీవావళీహంసి వ
ర్ణద్రాక్షాఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యు వే
దాద్రిస్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధివాక్సిద్షులన్!

తెనాలి రాముని కవిత్వంలో ఉన్న విశిష్టత మొత్తం ఈ పద్యంలొ చూడచ్చు. ఆయన వాడే ఉపమానాలు, ప్రయోగాలు చాల విశిష్టంగా ఉంటాయి. ఇక్కడ చూడండి శివుడిని కద్రూజాంగదుడు అన్నాడు – కద్రువ పిల్లలు నాగులు, అవి అంగదములుగా అంటే ఆభరణాలుగా గలవాడు, శివుడు.

సరే పద్యానికి సారం ఏమిటంటే వేదాద్రి మంత్రికి శారదా దేవి విద్య, బుద్ధి, వాక్సిద్ధి ప్రసాదించుగాక అని. ఐతే ఇదేదో అల్లాటప్పా దీవెన పద్యం కాదు. శారదా స్వరూపాలలో
విద్యనిచ్చేది – సరస్వతీ దేవి
బుద్ధిని ప్రచోదనం చేసేది – గాయత్రీ దేవి
మాటకి సిద్ధి ఇచ్చేది – మంత్ర స్వరూపిణి శ్యామలా దేవి

ఈ ముగ్గురి తత్వాలని ఎలా చూపించాడో చూడండి. భాగవతం ప్రకారం బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టినప్పుడు నుదుటినుంచి రుద్రుడు పుట్టాడు, ఆ తర్వాత మనసు నుంచి సరస్వతీ దేవి పుట్టింది. అందుకే శివుడి తోబుట్టువు సరస్వతి గనుక, మొదటి పాదంలో అది గుర్తు చేసాడు. ఆవిడ శుద్ధమైన విద్యా/జ్ఞాన స్వరూపం గనక తెల్లని శరత్కాల మేఘాలతో పోలిక.

ఇంక రెండవపాదంలో పద్మగర్భ ముఖ రాజీవావళీ హంసి – బ్రహ్మగారి ముఖాలనే పద్మాలలో తిరిగే హంస అన్నాడు. బ్రహ్మగారి 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి కదా. ఆ వేదాలలో తిరిగే హంస గాయత్రీ శక్తి. బుద్ధిని ప్రచోదనం చేసేది ఈవిడే.

ఇక మూడవపాదంలో చెప్పినది, వర్ణద్రాక్షాఫలకీరి – అక్షరాలనే ద్రాక్ష పళ్ళని మెక్కే చిలుక(ఎంత ఆగుదామన్నా హాస్యప్రియత్వం దాగదు). అమంత్రమక్షరం నాస్తి అనికదా. అంటే అక్షరాలన్నీ మంత్రములే. పైగా ద్రాక్షపళ్ళతో పోలిక అంటే బీజములు/గింజలు ఉన్నవి బీజాక్షరాలకి సూచన కదా. గుత్తులుగా ఉండేవి, అంటే బీజాక్షరాల గుత్తులు – మంత్రాలు. ఆ మంత్రాలతో నిండిన స్వరూపమే శ్యామలాదేవి. పైగా చిలుక – ఈవిడకి సంకేతమే. శుకశ్యామల అని ఒక స్వరూపం కూడా ఉంది.

దీనిని బట్టి చూస్తే తెనాలి రామునికి శ్యామలా ఉపాసనా విషయాలమీద పరిజ్ఞానం ఎంత ఉందో తెలుస్తోంది. ఈయన పద్యాలలో చిలుకని ఎన్నిసార్లు ప్రస్తావిస్తారంటే తప్పక శుకశ్యామలా ఉపాసకుడేమో అనిపిస్తుంది. పార్వతీ ప్రార్ధన, పరమేశ్వర ప్రార్ధన కూడ మంత్రశాస్త్ర పరిజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటి గురించి ఇంకోసారి.

ఇంకొక విషయం ఏమిటంటే, తెనాలి రాముడు రచించిన ఉద్భటాచార్య చరిత్ర అనే గ్రంధాన్ని యూరె దేచనమంత్రికి అంకితం ఇచ్చాడు. దేచనమంత్రి గొప్ప పండితుడు. శంకరాచార్యుల సౌందర్యలహరికి అధికారికమైన వ్యాఖ్యానం రాసిన లొల్ల లక్ష్మీధర పండితుడి శిష్యుడు. ఇలాంటి వారితో సాహచర్యం ఉన్న తెనాలి రాముడికి దేవీ ఉపాసనా రహస్యాలు తెలవడం విచిత్రమేమీ కాదు కదా.

మన కవుల ప్రజ్ఞా పాటవాలు ఎంతగొప్పవో ఇలాంటి ఒక్క పద్యం చూస్తే తెలుస్తుంది. ప్రయత్నించి అర్ధం చేసుకోగలగాలి కానీ ఎంతలోతుకెళ్ళినా అంతం ఉండదు. అందుకే అవి ఆలోచనామృతాలు.

సెప్టెంబర్ 26, 2007

పెళ్ళి తీర్చిన సమస్య!

కొంతమందికి పెళ్ళికాక సమస్య. చాలా మందికి పెళ్ళయ్యాకా ప్రతీదీ సమస్యే. మరి పెళ్ళివల్ల సమస్య తీరడం ఏమిటి అంటారా, నేను చెప్పేది లోకకళ్యాణం కోసం జరిగిన పెళ్ళిగురించి. అదే సీతారామకళ్యాణం. (more…)

సెప్టెంబర్ 2, 2007

క్రమాలంకారం కాళ్ళు మళ్ళీ పట్టుకుని…

తాంత్రిక శాస్త్రం చదువుకునే రోజుల్లో మా కళాశాల విద్యార్ధులందరికీ గౌతమ బుద్ధుడు ఆదర్శం. నిజమైన జ్ఞానం చెట్టుకిందే లభిస్తుందని గట్టిగా నమ్మేవాళ్ళం. అందుకే ఎక్కువ సమయం కళాశాల ఆవరణలో మా విభాగపు భవనానికి ఎదురుగా ఉన్న చెట్టుకింద గడిపేవాళ్ళం. (more…)

ఆగస్ట్ 14, 2007

కొత్త సమస్యలు

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడం.

కొత్తపాళీగారిని చూసి నేను పద్యాలు రాయడం.

రాసిన తర్వాత దురదకొద్దీ వాటిని బ్లాగడం.

పర్యవసానంగా ఊకదంపుడుగారుబాంబు పట్టుకొచ్చి నా బ్లాగులో పడేసారు. మిడతంభొట్లు మీ చేతిలో చిక్కేసాడండీ అని పేరు చెప్పి శరణు కోరడానికి అహం అడ్డు. ఏమిటి కర్తవ్యం?

పోరాడడం తప్ప వేరే మార్గం కనపడలేదు. తప్పదు, మీరు భరించాల్సిందే!

సమస్య:

“గర్భముదాల్చెను పురుషుడు గంగలొ మునగన్”

నా పూరణ:

కం|| గర్భాధానపు తంతును
      నిర్భీతిగ శంతనుండు నీటనె నెరపెన్
      గర్భము పండగ గంగకు 
      గర్భము దాల్చెను, పురుషుడు గంగలొ మునగన్!

(మహాభారతంలో భీష్ముడి తండ్రి శంతన మహారాజు, గంగను వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు. వాళ్ళు కాపరం ఎక్కడ చేసారో నేను చూడలేదు కానీ, మన సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల ఇంట్లోనే ఈ గర్భాధానపు తంతు జరుగుతుంది.)

(From Brown: పురుషుడు (p. 0776) [ puruṣuḍu ] purushuḍu. [Skt.] n. A man. A husband)

జూలై 5, 2007

తెనాలిరాముడి వికటకవిత్వం, నా పైత్యం (కొనసాగింపు…)

“కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్”
దోమ నోట్లో మదపుటేనుగులు దూరాయి అని దీనర్ధం. తెనాలి రామకృష్ణ సినిమా చూసిన తెలుగువారందరికీ ఈ సమస్య సుపరిచితమే. తెనాలి రాముడిని చూసి ఓర్వలేని కొంతమంది తోటి పండితులు ఒక కాపలా వాడిచేత ఈ సమస్యని అడిగిస్తారు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతే ఆయన తెనాలిరాముడెందుకౌతాడు. అందుకే కాపలా వాడిని అడ్డంపెట్టి వాళ్ళని బండబూతులు తిడతాడు. గంజాయి తాగి నానా జాతులతోటీ కలిసి కల్లుతాగి పేలుతున్నావా లం*కొడకా, ఎక్కడరా దోమనోట్లో ఏనుగులు దూరాయి? అని ఇలా పూరించాడు:

కం: గంజాయితాగి తురకల
     సంజాతులగూడి కల్లు చవిగొన్నావా
     లం*లకొడకా! ఎక్కడ
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

దెబ్బకి కుళ్ళుకున్నవాళ్ళు నోళ్ళుమూసుకుని ఏడ్చుకున్నారు. తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. కానీ ఈ విషయం రాయలవారికి చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు కదా, ఇంత అందమైన సమస్య వ్యర్ధమైపొయిందే అని బాధపడి తెనాలి రాముడిని పిల్చి, ఇప్పుడు ఇదే సమస్య నేనిస్తున్నాను పూరించమని ఆజ్ఞాపిస్తాడు. మరి తెనాలిరాముడి నాలుకకి రెండుపక్కలా పదునే కదా, ఎంత సరసంగా పూరించాడో చూడండి:

కం: రంజనచెడి పాండవులరి
     భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా!
     సంజయ! విధినేమందును
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

సంజయా! విధి ఎంత బలీయమైనదో చూసావా. పాండవులంతటివారు కూడా విరాటరాజు కొలువలో ఊడిగం చెయ్యాల్సివచ్చింది. ఏనుగులు వెళ్ళి దోమ నోట్లో దూరడం లాగ ఉంది ఇది అని మంచి సమయస్ఫూర్తితో పూర్తిచేసేప్పటికి రాయలవారు ఎంతో ఆనందించారుట.

ఇటువంటి పద్యాలూ, కధలూ తెనాలి రాముడిపేరు మీద ఎన్నో ఉన్నాయి. అవి నిజంగా జరిగినవా కావా అన్న వివాదాన్ని పక్కన పెడితే ఇంత మంచి సాహిత్య వారసత్వాన్ని మనకి అందజేసిన పెద్దవాళ్ళందరికీ మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలని నేను అనుకుంటాను.

ఇంక  నా పైత్యం గురించి. తెనాలిరాముడి గురించి నేను రాసిన పోస్ట్ చూసిన స్వాతికుమారి గారు రాయలవారి వేషంవేసి, “శ్రీరాం! ఈ సమస్యని పూరించండి చూద్దాం” అంటూ దీన్ని నాకు గుర్తుచేసారు. నా శాయశక్తులా ప్రయత్నించి ఇలా పూర్తిచేసా:

కం: గింజలు పండక కర్షకు
    లంజలిపట్టిరి కొలువుల నడుగుచు దొరలన్!
    బంజరు లయ్యెను భూములు
    కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్!

ఎవరి దయాదాక్షిణ్యాలమీదా ఆధారపడక భూమితల్లిని నమ్ముకుని స్వతంత్రంగా మదపుటేనుగుల్లా ఎంతో స్వాభిమానంతో జీవించే శ్రమజీవులు మన రైతులు. కానీ ఈరోజుల్లో వారి పరిస్తితి ఎంత దయనీయంగా మారిందో మనం చూస్తున్నదే. వ్యవసాయాన్నీ భూములనీ వదులుకుని చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో యజమానుల దయాదాక్షిణ్యాలమీద బతుకుతున్నారు. ఇది చూస్తే నాకు ఏనుగులు దోమనోట్లో దూరినట్టే అనిపించింది.

మరి నాపూరణ చూస్తే రాయలవారికేమనిపించిందో! 🙂

తర్వాత పేజీ »