హంసధ్వని అందాలు
వాతాపి గణపతిం భజే… అన్న కృతి వినని తెలుగు వాడుండడు. ఈ కృతి కోసం పుట్టినదే హంసధ్వని రాగం అనిపిస్తుంది నాకు. హంసధ్వని వల్ల వాతాపిగణపతిం కీర్తనకి పేరు వచ్చిందా లేక వాతాపి గణపతిం కీర్తన వల్ల హంసధ్వని అందం పెరిగిందా అనేది చెప్పటం కష్టం. ఇటువంటి అన్యోన్యత మరే ఇతర రాగాలకు ఏ కృతి తోనూ లేదు.
ఈ హంసధ్వని రాగాన్ని సృష్టించినది ముత్తుస్వామి దీక్షితార్ గారి తండ్రి గారైన రామస్వామి దీక్షితార్ గారు. మరి అందుకేనేమో ముత్తుస్వామి దీక్షితార్ గారు ఇంత అందమైన కృతిని కూర్చారు ఈ రాగంలో. ఏ కొడుకు మాత్రం ఇంతకన్న విలువైన బహుమతి ఇవ్వగలడు తండ్రికనిపిస్తుంది నాకు.
తెలుగు సినిమా సంగీత దర్శకులలో హంసధ్వనిని నాకు తెలిసి ఎంతో ప్రీతితో వాడినది ఇళయరాజా. రుద్రవీణ సినిమాలో తరలి రాద తనే వసంతం అన్న పాట ఒక అద్భుతమైన కంపోజిషన్. హంసధ్వని ఆధారంగా స్వరపరచిన ఈ పాట మాధుర్యంలో వసంత కోకిల గానాన్ని తలపిస్తుంది.
ప్రేమ చిత్రంలో ఇళయరాజా స్వరపరచిన ఈనాడే ఏదో అయ్యింది అన్న పాట కూడా హంసధ్వని ఆధారంగా చేసినదే. హంసధ్వని రాగాన్ని వాడి వాతాపిగణపతిం కీర్తన ఛాయలనుండి తప్పించుకోవడం ఇళయరాజాకే చెల్లింది.
జెంటిల్మేన్ చిత్రం రెహ్మాన్కి ఎంత పేరు తెచ్చిందో మనందరికీ తెలిసినదె. ఈ చిత్రంలోని ఒక మధురమైన పాట నా ఇంటిముందున్న పూదోటనడిగేవో అన్న దానిలో హంసధ్వని అందాలు తొంగి చూస్తాయి. పల్లవికీ మొదటి చరణానికి మధ్యలో వాయిద్యాన్ని వినండి. వాతాపి గణపతిం గుర్తుకొస్తుంది.
కలోనియల్ కజిన్స్గా పేరుపెట్టుకున్న జంట హరిహరన్, లెజ్ ల సంగీతం చాలా మధురంగా ఉంటుంది. విల్ యు బి మై లేడీ అన్న ఈ పాటవినండి. హంసధ్వనిని ఎంత గొప్పగా వాడుకున్నారో. పాటమొదలైన 2:30 నిముషాలకి వినిపించే పొడుగాటి వయొలిన్ వాదన వినండి ఎంతబాగుంటుందో.
శాస్త్రీయ సంగీత పరంగా చూస్తే హంసధ్వని చిన్నరాగమే. ఆరోహణలో ఐదు, అవరోహణలో ఐదు స్వరాలున్నాయి.
ఆరోహణ: స రి2 గ3 ప ని3 స
అవరోహణ: స ని3 ప గ3 రి2 స
ఈ రాగం పేరు చెప్పగానే గణేశుడే గుర్తుకు వచ్చేది. చాలా కీర్తనలు ఆయన పైనే ఉన్నాయి ఈ రాగంలో. హంసధ్వని కచేరీ ఆరంభంలో పాడే రాగం కావడం వల్లనేమో, ఉభయతారకంగా ఉంటుందని ఇలా చేసి ఉండచ్చు.
అన్ని కీర్తనలలోకీ తలమానికమైనది వాతాపిగణపతిం భజేహం. శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గాత్రంలో ఇక్కడ వినండి. శ్రీనివాస్ గారి మేండొలిన్ వాదనలో ఈ కీర్తన మెరుస్తుంది.
త్యాగరాజ స్వామి వారి రఘునాయకా అన్న కృతి చాలా అందంగా ఉంటుంది.
ముత్తయ్య భాగవతార్ గారి గం గణపతే అన్న కృతి చక్కటి సాహిత్యం కలిగి ఉంటుంది.
హంసధ్వని రాగంలోని మరిన్ని కృతులకై ఇక్కడ చూడండి.
Thanks Sriram. It is a gentle and nice introduction.
Doubt: శాంతినివాసంలో శ్రీరఘురాం జయరఘురాం, శ్రీకృష్ణపాండవీయంలో స్వాగతం స్వాగతం కూడా హంసధ్వనేనా?
– నాగరాజు పప్పు
వ్యాఖ్య ద్వారా Nagaraju Pappu — మార్చి 15, 2007 @ 12:38 పూర్వాహ్నం
మరో విన్నపం:
ఈ రాగానికి లక్ష్య ప్రబంధ గీతంగా రామాస్వామి ధీక్షితులు గారి రచన చందసేయళ అనే కృతి చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడో మా గురువుగారు పాడగా వినడమేకాని, ఈ పాట నాకెక్కడా దొరకలేదు. మీ దగ్గరుంటే చెప్పండి…
నాకు గుర్తున్నంతవరకు, ఆ కృతి:
చందసేయళ రుండమలధర
పంనగబళన భక్తజనావళురే
బ్రమ్మాదిసేవిత త్రిపురాంతక
కిటత్క ఝెండ్కత్క ఝెంఝెం ఝే ఝే కిణ ఘుంకిణ
టక ణక ణక ణక ణక ణక ణక ణక ణక ణక క్కత్కద్గి ద్గి ఝేంతరి ఝేం
తేనంతెనతెనతెన తేనం తెన తెనం న
వేంకట కృష్ణ పూజిత పాదాంబుజ
రే ఉపాంగ హంసధ్వనీ కృత
శ్రీరంగ ప్రబంధ గాన ప్రియరేరే
చిదంబర నివాసా శివకామ సుందరీ
ప్రాణేశ నటేశ పాహి పాహిరే…
–నాగరాజు పప్పు
వ్యాఖ్య ద్వారా Nagaraju Pappu — మార్చి 15, 2007 @ 1:17 పూర్వాహ్నం
బాగుంది వ్యాసం. చౌరాసియా ప్రభృతులు ఈ రాగాన్ని హిందుస్తానీలోకి దత్తత తీసుకుని వారి కచేరీల్లో కూడా బాగా ప్రాచుర్యం కలిగించారు. వాతాపి బాగా అలవాటైపోయిన (అరిగిపోయిన అనికూడా అనొచ్చేమో) కృతి కావడంతో కచేరీల్లో పాడ్డం తగ్గి పోయింది. తరంగిణీ కేసెట్లలో జేసుదాసు, దీక్షితుల కృతుల సీడీలో బాలమురళీ హంసధ్వనిని బాగా పొడుగున ఆలపించి, అవసరమైన శ్రద్ధ చూపించి ఈ కృతిని పాడారు. కర్ణాటక సంగీతం కొత్తగా వినడం మొదలుపెట్టిన వారికి తేలిగ్గా గురుతు పట్టడానికి వీలైన రాగాల్లో ఇదొకటి.
వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మార్చి 15, 2007 @ 8:11 అపరాహ్నం
గోపాల నను పాలింప రార అని ఒక పాత సినిమా పాట, సినిమా పేరు తెలీదు, సుశీల పాడింది. హంసధ్వనే కానీ బాణీ హిందుస్తానీలాగా ఉంటుంది
వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మార్చి 15, 2007 @ 9:06 అపరాహ్నం
నాగరాజు గారూ…ధన్యవాదాలు.
మీరు చెప్పిన స్వాగతం సుస్వాగతం పాట విని చూసాను. హంసధ్వని ఉపయోగించబడింది ఈ పాటలో. పాట మొదలైన సుమారు ఒక నిముషానికి కొమ్ము బూరాల మోత తరువాత వీణా వాదనం ఆ తరువాత జలతరంగం వినపడతాయి. వీణ స్వరాలు సా…ప రి గ రి స ని సా గా అనిపించాయి.జలతరంగం వాదన మరింత స్పష్టమైన హంసధ్వని.
శ్రీ రఘురాం నాకు ఆన్లైన్ దొరకలేదు. విని చాలారోజులైంది. చెప్పడం కష్టం.
మీరు చెప్పిన ప్రబంధ గీతం నేను ఇదివరకు వినలేదండీ.
“చందసేయళ రుండమలధర
పంనగబళన భక్తజనావళురే”
దీని అర్ధం ఏంటో చెప్పగలరా దయచేసి. ఇంకొక విషయం ఏమిటంటే హంసద్వని గురించి రామస్వామి దీక్షితుల వారి ముందే ముద్దు వెంకటమఖి ఈ రాగలక్షణాన్ని తన పుస్తకంలో వివరించాడుట. రామస్వామి దీక్షితుల వారు దీనిని ప్రసిద్ధిలోకి తీసుకొచ్చినట్టు మాత్రమే అనుకోవాలిట.
కొత్తపాళీ వారికి ధన్యవాదాలు. మొన్ననే బాలమురళీ గారు దూరదర్శన్ లో ఒక అరగంట కచేరీలో 20 నిముషాలు పైన వాతాపి అద్భుతంగా పాడారు. హంసధ్వని తరువాత ఒక చిన్న హంసనాదం పాడారు
అవునండీ హిందుస్తానీ బాణీలో చాలా పాపులర్ ఐంది హంసధ్వని. పన్నాలాల్ ఘోష్ గారి అరుదైన వేణునాదంలో ఇక్కడ వినండి:
http://www.esnips.com/doc/5939267b-c657-4cbe-bc3b-6796e2d7ee97/Pannalal-Ghosh—-1963_71-vinyl-07—Hansadhwani
వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 15, 2007 @ 9:32 అపరాహ్నం
ఘంటసాలగారి గాత్రంలో తప్ప వాతాపిగణపతింభజే నేనింతవరకూ మరెక్కడా వినలేదు. విల్ యూ బీమై లేడీ - కలోనియల్ కజిన్స్ పాటల్లో అన్నింటికంటే ఎక్కువగా నన్ను రంజింపజేసిన పాట. మొన్న హ్యూస్టన్ లో జరిగిన హరిహరన్ కచేరీలో ఈ పాట అడుగుదామని విఫలయత్నం చేశాను.
వ్యాఖ్య ద్వారా రానారె — మార్చి 26, 2007 @ 1:16 పూర్వాహ్నం
రానారెగారూ…మ్యూజికిండియా ఆన్లైన్ లో చాలా మందివే ఉన్నాయి. ఒకసారి విని చూడండి.
వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 30, 2007 @ 1:31 అపరాహ్నం